India Alliance Meet: ముంబైలో ఇండియా కూటమి రెండో రోజు సమావేశం

ముంబైలో ఇండియా కూటమి సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కూటమి పక్షాలన్ని కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయించారు. దీని కోసం కూటమిలోని పక్షాల మధ్య సమన్వయానికి కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్, చైర్ పర్సన్ లేకుండానే ఏర్పాటు చేసిన ఈ కమిటీలో 13 మంది సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, డీఎంకే నుంచి స్టాలిన్, శివసేన ఉద్దవ్ వర్గం నుంచి సంజయ్ రౌత్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్, ఆప్ నుంచి రాఘవ్ చద్దా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభిషేక్ బెనర్జీ.. కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
వీలైనంత వరకు ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి కట్టుగా పోటీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆయా రాష్ట్రాలలో సీట్ల సర్దుబాటు అంశంపై వెంటనే చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వీలైనంత త్వరగా చర్చలు పూర్తి చేయాలని నిర్ణయించారు. వెంటనే ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి తరపున ప్రజా సమస్యలపై దేశంలోని వివిధ ప్రాంతాలలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జుడేగా భారత్... జీతేగా భారత్ నినాదంతో ముందుకు వెళ్లాలని ఇండియా కూటమి పక్షాలు నిర్ణయించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com