India-China: భారత్-చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు..

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని కొనసాగించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి.ఈ మేరకు భారత విదేశంగా శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తిస్థాయిలో బలగాల ఉపసహరణే లక్ష్యంగా ఫిబ్రవరి 19న 21వ విడత కోర్ కమాండర్ స్థాయి సమావేశం జరిగిందని పేర్కొంది. మరోవైపు బీజింగ్తో చర్చలు కొనసాగిస్తూనే భారత్... సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది.
వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు కొనసాగిస్తూనే.. భారత్ తన సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా న్యూదిల్లీ-బీజింగ్ మధ్య 21వ విడత కోర్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. దీనిని చుషూల్-మాల్డో సరిహద్దుల్లో భారత్ వైపు మీటింగ్ పాయింట్ వద్ద నిర్వహించారు. పూర్తిస్థాయిలో బలగాల ఉపసహరణే లక్ష్యంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరు పక్షాలు సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ప్రశాంతత నెలకొల్పేటట్లు చూడాలని నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. గత చర్చల్లో కూడా దెప్సాంగ్, డెమ్చోక్ వద్ద పరిష్కారం కోసం భారత్ ప్రతినిధులు చైనాపై ఒత్తిడి తెచ్చారు.
సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేలా భారత సైన్యంలో కీలక మార్పులు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సెంట్రల్ కమాండ్ అధీనంలో సరికొత్త కోర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిని స్వయంసత్తాక దళాల్లా తీర్చిదిద్దేలా శతఘ్ని, వైమానిక, ఇంజినీరింగ్ వంటి విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వీటిని 18 కోర్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఒక డివిజన్ మూడు స్వతంత్ర బ్రిగేడ్లు ఉండనున్నాయి. వీటికి వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని ప్రాంతాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా సెంట్రల్ కమాండ్ LACలో కొంత భాగాన్ని, నేపాల్ సరిహద్దుల బాధ్యతలను చూస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com