Oil Purchases From US: అమెరికా చమురు కొనేందుకు సిద్ధమే కానీ..: భారత్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ సహా అన్ని దేశాలపై ఇటీవల టారిఫ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే భారత్పై మొదట 25 శాతం పన్నులు విధించిన ట్రంప్.. ఆ తర్వాత మరో 25 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేస్తున్నందున భారత్పై అదనంగా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ గతంలోనే ప్రకటించారు. అయితే తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా.. ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే తాము చమురు కొనుగోళ్లు చేస్తున్నామని భారత్ చెబుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తాజాగా కీలక ప్రకటన చేశారు.
సరైన ధరకు లభిస్తే.. అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను మరింత పెంచడానికి భారత్ సిద్ధంగా ఉందని రాజేష్ అగర్వాల్ స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు బయటికి రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఈ వాణిజ్య ఒప్పందం ఖరారైతే.. భారత ఎగుమతులపై ప్రస్తుతం అమెరికా విధిస్తున్న 50 శాతం టారిఫ్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
భారతీయ దిగుమతులపై విధించిన మొత్తం టారిఫ్లలో.. 25 శాతం టారిఫ్ను రాయితీపై రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలును కొనసాగిస్తున్నందుకు అమెరికా పెనాల్టీగా విధించిన సంగతి తెలిసిందే. భారత తరపున కీలక చర్చల్లో ఉన్న రాజేష్ అగర్వాల్.. తమ దేశం తన ఇంధన దిగుమతులను మరింత విస్తరించాలని భావిస్తోందని స్పష్టం చేశారు. గతంలో అమెరికా నుంచి భారత్ 23 బిలియన్ డాలర్ల ఇంధన కొనుగోళ్లు చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ ఇంధన కొనుగోళ్లను 13 బిలియన్ డాలర్ల మేర పెంచడానికి భారత్కు ఇంకా అవకాశం ఉందని రాజేష్ అగర్వాల్ అమెరికా నుంచి వెల్లడించారు.
అధికారిక లెక్కల ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి భాగంలో అమెరికా నుంచి భారత్ 8.5 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకుంది. ఇది దేశం మొత్తం దిగుమతుల్లో 3.5 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇక భారత్కు వచ్చే అధిక భాగం అంటే 36.3 శాతం లేదా 89.5 మిలియన్ టన్నుల చమురు రష్యా నుంచే వస్తుండటం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టులో భారత్పై టారిఫ్లను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచిన అమెరికా.. తక్కువ ధరకు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసి.. దాన్ని శుద్ధి చేసి.. తర్వాత పశ్చిమ దేశాల మార్కెట్లో చమురు ఉత్పత్తులను తిరిగి అమ్మి భారత్ లాభపడుతోందని ఆరోపణలు చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com