Operation Sindoor: కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదు

Operation Sindoor: కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదు
X
అధికారిక చర్చల్లో వాణిజ్య ప్రస్తావన లేదన్న భారత్

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఘర్షణలు తగ్గినప్పుడే ఆ దేశాలతో వాణిజ్యం సాధ్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ వ్యాఖ్యలకు భిన్నంగా భారత్, అమెరికా మధ్య జరిగిన ఉన్నతస్థాయి అధికారిక చర్చల్లో వాణిజ్యానికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన రాలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి.

సమాచారం ప్రకారం, మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషించారు. అదేవిధంగా, అమెరికా సెక్రటరీ మార్కో రూబియో మే 8, 10 తేదీల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తోనూ, మే 10న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ వేర్వేరుగా చర్చలు జరిపారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశాలన్నింటిలోనూ ప్రధానంగా ప్రాంతీయ పరిస్థితులు, భద్రతా అంశాలపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, ఘర్షణల పరిష్కారంతో ముడిపెడుతూ ఎలాంటి సంభాషణా జరగలేదని సదరు వర్గాలు స్పష్టం చేశాయి. ట్రంప్ తన ప్రసంగంలో ఇరుదేశాల మధ్య శాంతి నెలకొంటేనే వాణిజ్యపరమైన అంశాలు ముందుకు సాగుతాయన్న ధోరణిలో మాట్లాడగా, అధికారిక చర్చలు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా సాగినట్లు స్పష్టమవుతోంది.

భారత్‌- పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు మా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ అన్నారు. అనేక అణ్వాయుధాలను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ప్రమాదకర పోరాటం జరుగుతున్న సమయంలో అమెరికా యంత్రాంగం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించిందని ట్రంప్‌ వివరించారు. ఉద్రిక్తతలకు ముగింపు పలికితేనే వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటామని, లేకపోతే ఎటువంటి వాణిజ్యం చేయబోమని స్పష్టం చేసినట్లు ట్రంప్ అన్నారు. దీంతో ఆ దేశాలు సానుకూలంగా స్పందించాయంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీన్ని భారత్‌ తాజాగా ఖండించింది.

Tags

Next Story