Narendra Modi: 127 ఏండ్ల తర్వాత భారత్కు బుద్ధుని అవశేషాలు

భారత సాంస్కృతిక చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. బ్రిటిష్ పాలనలో దేశం నుంచి తరలిపోయిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలు సుమారు 127 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి మాతృభూమికి చేరుకున్నాయి. ఈ శుభవార్తను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం 'ఎక్స్' వేదికగా దేశ ప్రజలతో పంచుకున్నారు. ఇది భారతదేశపు సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మిక ప్రకాశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
"ఈ చారిత్రక సంఘటన భారతదేశానికి, మన సాంస్కృతిక వైభవానికి గర్వకారణం. బుద్ధుడి పవిత్ర అవశేషాలు మన దేశంతో ఆయనకున్న గాఢమైన అనుబంధాన్ని, ఆయన ఉన్నత బోధనలను ప్రతిబింబిస్తాయి" అని ప్రధాని మోదీ తెలిపారు. 1898లో ఉత్తరప్రదేశ్లోని పిపర్వాహలో (భారత్-నేపాల్ సరిహద్దు సమీపం) జరిగిన పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల్లో ఈ అమూల్యమైన అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. గౌతమ బుద్ధుడి అస్థి అవశేషాలతో పాటు విలువైన పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాలు కూడా ఈ తవ్వకాల్లో లభ్యమయ్యాయి.
అయితే, బ్రిటిష్ పాలనలో ఈ అపరూప సంపద దేశం నుంచి తరలిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఒక అంతర్జాతీయ వేలంలో ఈ అవశేషాలు మళ్లీ కనిపించగా, వాటిని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. "ఈ అవశేషాల తిరిగి రాక భారతదేశం ఆధ్యాత్మిక, సాంస్కృతిక గొప్పతనాన్ని పునరుద్ఘాటిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com