Operation Himrahat: సిక్కింలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకున్న పర్యాటకులు ..46 మంది పర్యాటకులను కాపాడిన సైన్యం

తూర్పు సిక్కింలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన 46 మంది పర్యాటకులను భారత సైన్యం సురక్షితంగా కాపాడింది. 'ఆపరేషన్ హిమ్రాహత్' పేరుతో చేపట్టిన ఈ సహాయక చర్యలు విజయవంతమయ్యాయని అధికారులు వెల్లడించారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సైన్యం వేగంగా స్పందించి పర్యాటకులను రక్షించింది.
రక్షణ శాఖ అధికారుల కథనం ప్రకారం నిన్న తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రదేశాలలో ఒక్కసారిగా భారీగా మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పదుల సంఖ్యలో పర్యాటకుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతంలోని సైనిక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. చిక్కుకుపోయిన పర్యాటకులను సమీపంలోని ఆర్మీ క్యాంపునకు తరలించి వారికి తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించారు. వెచ్చని దుస్తులు, వేడి భోజనం, తాత్కాలిక నివాస సౌకర్యాలు కల్పించి చలి తీవ్రత నుంచి కాపాడారు. పర్యాటకులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే వారి ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.
ఈ ఆపరేషన్లో భాగంగా ప్రమాదకరంగా నిలిచిపోయిన 150కి పైగా వాహనాలను కూడా సైన్యం సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారత సైన్యం అందించే మానవతా సహాయక చర్యలకు 'ఆపరేషన్ హిమ్రాహత్' ఒక నిదర్శనమని అధికారులు కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
