Israel-Iran: మన వాళ్ళందరూ తక్షణమే టెహ్రాన్ ఖాళీ చేయండి.. పౌరులకు భారత్ పిలుపు

Israel-Iran: మన వాళ్ళందరూ తక్షణమే టెహ్రాన్ ఖాళీ చేయండి.. పౌరులకు భారత్ పిలుపు
X
అత్యవసర పరిస్థితుల్లో రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచన

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉధృతం అవుతున్న వేళ భారత్ అప్రమత్తం అయింది. తక్షణమే పౌరులు టెహ్రాన్ ఖాళీ చేయాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించే అవకాశం ఉందని.. తక్షణమే భారత సంతతికి చెందిన వ్యక్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. సొంత వనరులు ఉపయోగించుకుని వెళ్లిపోవాలని తెలిపింది.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు చేదాటుతున్నాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఇక మంగళవారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. భారీ పేలుళ్లు, వైమానిక దాడులు జరిగాయని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇక అత్యవసర పరిస్థితుల్లో భారతీయ పౌరులందరూ వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా కోరింది. ఎలాంటి అవసరత వచ్చినా ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరింది. +989010144557,+989128109115, +989128109109 నెంబర్లకు కాల్ చేయాలని తెలిపింది.

టెహ్రాన్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్‌ దాడి

మరోవైపు టెహ్రాన్‌ ఎయిర్‌పోర్ట్‌ పై ఇజ్రాయెల్‌ భీకర దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన రెండు F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోని ఐడీఎఫ్‌ దళాలు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాయి. ఇజ్రాయెల్‌ విమానాలను అడ్డుకునేందుకు టెహ్రాన్‌ వీటిని ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. తమ దాడిలో ఆ ఫైటర్‌ జెట్స్‌ పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించింది.

మరోవైపు, తమ లక్ష్యాలు ఇంకా పూర్తి కానందున ఇరాన్‌లోని ఆయుధాగారాల సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్‌ తాజాగా హెచ్చరించింది. ఇరాన్‌తో సైనిక ఘర్షణలు ప్రారంభమైన నాలుగవ రోజు సోమవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ గగనతలంపై తమకు పట్టు చిక్కిందని ఇజ్రాయెలీ సైన్యం ప్రకటించింది. ఏ విధమైన సవాళ్లు లేకుండా టెహ్రాన్‌ గగనతలంపై తమ యుద్ధ విమానాలు విహరించగలవని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఇరాన్‌పై తమపై జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడిలో ఇప్పటి వరకు 24 మంది మరణించగా 500 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఇరాన్‌కు చెందిన 120కి పైగా క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది.

Tags

Next Story