Amicus curiae: ప్రజాప్రతినిధుల మీద కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమికస్ క్యూరీ

X
By - jyotsna |10 Feb 2025 8:45 AM IST
విచారణలో జాప్యం ప్రజాస్వామ్యానికి మచ్చ అని విజయ్ హన్సారియా వ్యాఖ్య
పార్లమెంటు, శాసనసభల సభ్యులపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేయాలని కోర్టులను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వీరిపై దాదాపు 5,000 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తుపై వారి ప్రభావం చాలా ఉంటున్నదని, విచారణ జరగనివ్వడం లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, హైకోర్టులు పర్యవేక్షిస్తున్నప్పటికీ, వీరిపై కేసులు పెండింగ్లోనే ఉంటుండటం మన దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు కళంకమని పేర్కొంది.
ప్రమాణపత్రంలోని ముఖ్యాంశాలివీ..
- ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని సుప్రీంకోర్టు పదేపదే ఉత్తర్వులు జారీచేసినా, హైకోర్టులు పర్యవేక్షిస్తున్నా.. ట్రయల్ కోర్టులు విచారణలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ, పదేపదే వాయిదాలు వేస్తున్నాయి.
- పెండింగ్ కేసుల సంఖ్యను, కొన్నింటిలో విచారణ దశాబ్దాలపాటు సాగుతుండటాన్ని చూస్తుంటే.. ప్రజాప్రతినిధులు తమపై కేసుల దర్యాప్తు, ట్రయల్పై తీవ్ర ప్రభావం చూపుతున్నారని అర్థమవుతోంది. విచారణను వారు ముందుకు సాగనివ్వడం లేదని స్పష్టమవుతోంది!
- కోర్టు నిర్ణయించిన తేదీల్లో నిందితులు విచారణకు హాజరవడం లేదు.
- తాజా సూచనలివీ..
- సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకొని.. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగంగా పూర్తిచేసేలా ట్రయల్ కోర్టులకు ఆదేశాలు జారీ చేయాలి.
- ఈ కేసుల విచారణ, జాప్యాల వివరాలను హైకోర్టుల వెబ్సైట్లలో స్పష్టంగా పొందుపరిచి, అందరికీ అందుబాటులో ఉంచాలి.
- ప్రత్యేక కోర్టులు ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ మాత్రమే చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలి. వాటి విచారణ ముగిసిన తర్వాతే ఇతర కేసులను తీసుకొనేలా ఆదేశించాలి. ఎంపీ/ఎమ్మెల్యేలపై ట్రయల్ పూర్తయిన తర్వాతే జిల్లా ముఖ్య, సెషన్స్ జడ్జీలకు ఇతర సాధారణ పనులు కేటాయించాలి.
- 3 ఏళ్లకుపైబడి పెండింగ్లో ఉన్న కేసుల విచారణను భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్-346 ప్రకారం రోజువారీగా చేపట్టేలా ఆదేశించాలి.
- నిందితులు వరుసగా రెండు వాయిదాలకు హాజరు కాకపోతే.. నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి.
- సీఆర్పీసీ సెక్షన్-144 ప్రకారం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించారని.. ఐపీసీ సెక్షన్-188 కింద ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు ఏడాదికి మించి పెండింగ్లో ఉంటే కొట్టేయాలి.
- ఎంపీలు/ఎమ్మెల్యేల కేసుల విచారణ పురోగతిని అన్ని హైకోర్టులూ నెలవారీగా పర్యవేక్షించాలి. అభియోగాల నమోదు తర్వాత ఏడాదికి మించి సమయం పట్టకుండా విచారణ ముగించాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com