కాగ్నిజెంట్ భారీ స్కెచ్.. 3,500 మంది ఉద్యోగులను..

ఐటీ కంపెనీల్లో తొలగింపులు ఇప్పట్లో ఆగేటట్టు లేవు. పేరున్న ప్రముఖ కంపెనీలైనా ఉద్యోగులను ఉన్నఫళంగా పీకేస్తున్నారు. అదేమంటే ఆర్థిక పరిస్థితులే కారణంగా చూపుతున్నాయి. కాగ్నిజెంట్ దాదాపు 3,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపే ప్రయత్నాల్లో ఉంది. అలాగే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని కార్యాలయాలను మూసివేయనుందని కంపెనీ సీఈఓ ఎస్ రవి కుమార్ వెల్లడించారు.
ఈ ఏడాది చివరి నాటికి ఆదాయం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మొత్తం 3,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భారత్కు చెందిన వారు ఎంతమంది ఉంటారనేది తెలియరాలేదు.
కాగ్నిజెంట్ పేరుకే అమెరికా కంపెనీ.. కార్యకలాపాలన్నీ భారత్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. ప్రస్తుతం కాగ్నిజెంట్లో 3,51,500 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, అందులో 2 లక్షల వరకు భారత్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com