J&K Cyber Security: పెన్ డ్రైవ్, వాట్సాప్పై నిషేధం.. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో పెన్డ్రైవ్ వాడకాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అధికారిక సమాచార మార్పిడి కోసం వాట్సాప్ మెసేజింగ్ సర్వీసును కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సైబర్ దాడుల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైబర్ దాడులు పెరగడంతో సైబర్ భద్రతా ఉల్లంఘన భయాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్ సెక్రటరీ ఎం.రాజు ఉత్తర్వుల్లో తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచారాన్ని పరిరక్షించడం, డేటా ఉల్లంఘనలను సాధ్యమైనంతమేర తగ్గించడం, మాల్వేర్ దాడుల్ని నివారించడం ఈ నిషేధం ప్రధాన ఉద్దేశం. దాంతో ప్రభుత్వ కార్యకలాపాల కోసం పెన్రైవ్ వాడకాన్ని నిషేధించాం. ఏదైనా అధికారిక సమాచార మార్పిడి కోసం వాట్సప్, ఇతర సోషల్ మీడియా వేదికలను వాడటాన్ని కూడా నిషేధించాం” అని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా మెరుపుదాడులు చేసింది. అత్యంత కచ్చితత్వంలో కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య కొన్ని రోజుల పాటు భీకర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి చెందిన పలు అధికారిక వెబ్సైట్లు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విభాగం సైట్లు సైబర్ దాడులకు గురయ్యాయి. వాటిని పునరుద్ధరించడంలో ఇప్పటికీ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజాసేవలకు ఆటంకం ఏర్పడింది. ఆ సమయంలో పవర్ సెక్టార్పై రెండు లక్షల సైబర్ దాడులు జరిగాయని, అన్నింటిని అడ్డుకున్నామని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com