Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10 గంటలకు ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ ఖన్నా 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, ఈవీఎంలు విశ్వసనీయమైనవని ప్రకటించడం, 370 అధికరణ రద్దును సమర్థించడం, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లాంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు. ఆయన 2019 జనవరి 18 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు.
రెండేండ్ల పాటు సీజీఐగా పనిచేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. అయోధ్య జన్మభూమి వివాదం, ఆర్టికల్ 370 రద్దు, స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడం వంటి తీర్పులలో భాగస్వామి కావడమే కాక, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 38 రాజ్యాంగ ధర్మాసనాలలో ప్రాతినిధ్యం వహించారు. సుప్రీంకోర్టులో 500కు పైగా తీర్పులు ఇచ్చారు. ఒక్క తీర్పులలోనే కాక, న్యాయ విభాగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు కళ్లకు గంతలతో ఉన్న న్యాయదేవత స్థానంలో ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో రాజ్యాంగం చేతబట్టిన కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.
సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని కొనసాగించడం. ఈ పరికరాలు సురక్షితమైనవని, బూత్ క్యాప్చరింగ్, ఫేక్ ఓటింగ్ను తొలగిస్తాయని తీర్పును ఇస్తూ చెప్పారు. ఏప్రిల్ 26న జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈవీఎం తారుమారు అనుమానాన్ని “నిరాధారమైనది” అని పేర్కొంది. పాత పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి మార్చాలనే డిమాండ్ను తిరస్కరించింది.
ఇది కాకుండా, రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్లో కూడా అతను సభ్యుడు. గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం 2019లో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్లో జస్టిస్ ఖన్నా భాగం. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుల్లో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తొలిసారిగా అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com