Vijay Mallya : అప్పు కంటే ఎక్కువే బ్యాంకులు నానుంచి వసూలు చేశాయి-విజయ్ మాల్యా

విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కన్నా ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకున్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ.6,200 కోట్లు బాకీ ఉన్నానని, తన నుంచి రూ.10,200 కోట్లు రాబట్టుకున్నాయని తెలిపారు. తనతోపాటు, యునైటెడ్ బ్రీవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్, ప్రస్తుతం లిక్విడేషన్లో ఉంది), ఇతర సర్టిఫికెట్ రుణగ్రస్థుల నుంచి రాబట్టుకున్న సొమ్ము వివరాలను తెలియజేయాలని కోరారు. తన నుంచి రూ.14,000 కోట్లు రాబట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు తెలిపారని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, బ్యాంకులకు నోటీసు జారీ చేసింది. ఈ నెల 13 నాటికి సమాధానం చెప్పాలని ఆదేశించింది. మాల్యా ఈ పిటిషన్ను ఈ నెల 3న దాఖలు చేశారు.
బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా తరుపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఆర్ దేవదాస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య తన వాదనల్ని కోర్టుకు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.6,200 కోట్ల అప్పు చేసిందని.. అందుకు బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని అన్నారు.
ఈ విషయం గురించి లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. మాల్యాకు చెందిన రూ.14, 131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని, ఆయన తీసుకున్న రుణంలో దాదాపు రూ.10, 200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారు.
కాబట్టి బ్యాంకులు తీసుకునే తదుపరి రికవరీ చర్యలపై తాత్కాలిక స్టే విధించాలని, అన్నీ బ్యాంక్ స్టేట్మెంట్లు అందించాలని మాల్యా కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com