Congress: కాంగ్రెస్ కు మాజీ సీఎం కుటుంబం షాక్ , కిరణ్ చౌదరి రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలకు ముందు హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు.కిరణ్ చౌదరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమె కుమార్తె శృతి చౌదరి కూడా కమలం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హర్యానా కాంగ్రెస్కు చెందిన నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల్లో శృతి ఒకరు.
కిరణ్ చౌదరి.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కోడలు. శృతి చౌదరికి లోక్సభ టిక్కెట్ నిరాకరించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో తనను పట్టించుకోలేదని శృతి చౌదరి ఆరోపించారు. భివానీ-మహేంద్రగఢ్ పార్లమెంటరీ స్థానం నుంచి తన కుమార్తెకు లోక్సభ టిక్కెట్ ఇవ్వాలని కిరణ్ చౌదరి కోరింది. కానీ పార్టీ నిరాకరించింది. దీంతో మనస్తాపంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. భివానీ-మహేంద్రగఢ్లో మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా విధేయుడైన రావ్ దాన్సింగ్ను కాంగ్రెస్ పోటీకి దింపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధరంబీర్సింగ్ చౌదరి చేతిలో ఓడిపోయాడు.
ఇదిలా ఉంటే ఇటీవలి జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓట్లను, సంఖ్యను పెంచుకుంది. హర్యానాలో పోటీ చేసిన 9 సీట్లలో 5 కైవసం చేసుకుంది. ఓట్లు 15 శాతం పెరిగాయి. కిరణ్ చౌదరి తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. హర్యానాలో అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com