IPS officer: లేడీ సింగం ఇషా సింగ్పై బదిలీ వేటు

పుదుచ్చేరి ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్పై బదిలీ వేటు పడింది. ఆమెకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. యువలాయర్ టు ఐపీఎస్గా మారిన ఇషా సింగ్.. మొన్నీమధ్యే వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే.
పుదుచ్చేరి తమిళగ వెట్రి కగళం (TVK) పార్టీ అధినేత విజయ్ ఆ మధ్య నిర్వహించిన ర్యాలీలో ఇషా సింగ్ హైలైట్ అయ్యింది. జనసేకరణ చేయకుండా టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్ను అడ్డుకున్నారామె. ‘‘సభా ప్రాంగణంలో చాలా స్థలం ఉందని.. లోపలికి రావాలంటూ బయట ఎదురు చూస్తున్న కార్యకర్తలకు ఆయన మైక్ ద్వారా పిలుపు ఇచ్చారు. అయితే..
‘‘ఎంతో మంది ప్రాణాలు తీశారు. ఇంక చాలదా?’’ అనే అర్థం వచ్చేలా కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇషా సింగ్ ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో లేడీ సింగంగా ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగింది. అయితే..
ఆనాటి నుంచి ఇషా సింగ్కు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ ఎదురయ్యాయి. టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులే ఈ పని చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో హఠాత్తుగా ఆమె బదిలీ కావడం వెనుక టీవీకే ప్రమేయం కూడా ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. అటు టీవీకే కూడా దీనిని ఖండించాల్సి ఉంది.
1998 ముంబైలో జన్మించిన ఇషాసింగ్.. 2020లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 191 ర్యాంకర్. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్ వైపీ సింగ్(ముంబై పోలీస్ కమిషనర్గానూ పని చేశారు). తల్లి అభాసింగ్ లాయర్, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్ నేషనల్ లా స్కూల్నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐపీఎస్ కాకముందు.. లాయర్గా ప్రాక్టీస్ చేశారు. 2021 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఇషా సింగ్.. పుదుచ్చేరి పోలీస్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తుండగానే నెట్టింట వైరల్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

