Prajwal Revanna : సెక్స్ కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం

హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. జర్మనీలో ఉన్న ప్రజ్వల్పై లుక్ఔట్ నోటీసులు జారీ చేసింది. కేసులో చాలా కోణాలున్నాయనీ.. భారత్కు రావడానికి 7 రోజులు పడుతుందన్న ప్రజ్వల్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రజ్వల్ మైనర్లనూ వేధించాడన్న ఆరోపణలు రావడంతో ఆ సాక్ష్యాల సేకరణలో కూడా సిట్ నిమగ్నమైంది. పనిమనిషి అయిన బాధితురాలి కుమార్తెకూ వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రజ్వల్ ప్రవర్తించినట్లు సమాచారం. ఇది రుజువైతే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని సిట్కి నేతృత్వం వహిస్తున్న IPS అధికారి Bkసింగ్ చెప్పారు. పలు వీడియోల్లో ప్రజ్వల్తోపాటు మహిళల ముఖాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఇప్పటికే పనిమనిషి వాంగ్మూలాన్ని నమోదు చేశామనీ.. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతుందన్నారు. ప్రజ్వల్ను వెనక్కి రప్పించేందుకు సిట్ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని, ఆయన రాకపోతే అక్కడే అరెస్టు చేస్తారని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర్ తెలిపారు. దర్యాప్తు విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.
వీడియోల్లో ప్రజ్వల్తో కనిపించిన యువతులు, మహిళల వివరాలను పోలీసులు, సిట్ అధికారులు గుర్తించారు. తమకు ఫిర్యాదు ఇస్తే ప్రజ్వల్పై చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు. ఉద్యోగాలు, పదోన్నతులు, బదిలీల వంటి అవసరాల కోసం ప్రజ్వల్ను ఆశ్రయించడంతో తమ విషయం బయటకు తెలియకుండా ఉంచేందుకే మహిళలు గోప్యత పాటిస్తున్నట్లు తెలిసింది. సంసారం కూలిపోతుందన్న భయంతో సిట్కు ఎవరూ ఫిర్యాదు చేయడంలేదు. తమను సంప్రదించవద్దని ఎక్కువమంది మహిళలు సిట్కు విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రజ్వల్ నివాసంలో పని చేసిన పనిమనిషి మినహా మరెవరూ ఆయనపై ఫిర్యాదు చేయలేదు. హాసనతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న తన గెస్ట్హౌస్నే ప్రజ్వల్ వినియోగించుకున్నాడని, అక్కడే మహిళలను రప్పించుకునేవాడని ప్రాథమికంగా సిట్ గుర్తించింది.
వీడియోలు వెలుగు చూసిన వెంటనే జర్మనీకి వెళ్లిపోయిన నిందితుడు ప్రజ్వల్. శుక్రవారం రాత్రికే బెంగళూరుకు తిరిగి రానున్నారని ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ ప్రకటించారు. ప్రజ్వల్ 3 నెలలు జర్మనీలో ఉండే అవకాశం ఉన్నా.. సిట్ దర్యాప్తు నేపథ్యంలో వెనక్కు తిరిగి వస్తున్నారని హెచ్డి రేవణ్ణ తెలిపారు. కేసులో ఏ1 గా హెచ్డి రేవణ్ణ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని హెచ్డీ రేవణ్ణ చెబుతున్నారు. తనపై, తన కుటుంబంపై కుట్ర జరిగిందనీ దర్యాప్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో హొళెనరసీపురలోని రేవణ్ణ నివాసం జనం లేక వెలవెలబోతోంది. కార్యకర్తలు ముఖం చాటేశారు. ప్రజ్వల్ ఎంపీ కావడం, ఆయన కుటుంబీకులంతా రాజకీయ నేపథ్యం ఉన్నవారు కావడంతో విదేశాల్లోనూ ఈ కేసు మారుమోగిపోతుంది. యువతులు, మహిళలను ప్రజ్వల్ లైంగిక అవసరాలకు వాడుకున్నాడంటూ పలు విదేశీ మాధ్యమాలు ప్రసారం చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com