Puri Rath Yatra 2025: జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథ యాత్ర మరి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక, లక్షలాది మంది భక్తులు ఈ రథాల వెంటరాగా జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలి వెళ్లనున్నారు. ఆలయ పరిసరాలన్నీ ఒక్కసారిగా భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుకలో సుమారు 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేశారు.
అయితే, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. ఈసారి ఏకంగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. దీంతో పాటు 10 వేల మంది జవాన్లను సర్కార్ నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై నిఘా ఉంచినట్లు ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా వెల్లడించారు. అలాగే, భద్రతతో పాటు వైద్య సేవలకూ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీఠ వేసింది. ఈ ఏడాది రథయాత్ర సందర్భంగా 69 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, 64 అంబులెన్స్లు, 265 ప్రత్యేక ఆసుపత్రి పడకలు, 378 అదనపు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీలో ఉండనున్నారు. ఏఐఎమ్ఎస్ భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఈసారి పూరీలోని రథయాత్ర వద్ద విధులు నిర్వహించనున్నారు. యాత్రను భద్రంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భక్తుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com