LPG Price Hike: వాణిజ్య సిలిండర్‌పై రూ.21 వడ్డన

LPG Price Hike: వాణిజ్య సిలిండర్‌పై రూ.21 వడ్డన
ఎన్నికలు ముగియగానే గ్యాస్ బాదుడు..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో.. అలా వంట గ్యాస్ ధర పెరిగింది. తెలంగాణ సహా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 3వ తేదీన వెలువడనున్న సంగతి తెలిసిందే. చిట్ట చివరిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇదే సమయంలో వంట గ్యాస్ ధర పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఉన్న చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ పై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సుమారు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.12 పెంచినట్లు కంపెనీలు పేర్కొన్నాయి. సిలిండర్ పై పెరిగిన ధరలు అతి త్వరలోనే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. పోయిన నెలలో కమర్షియల్ సిలిండర్ లపై రూ. 103 పెంచగా.. మరోసారి ఇప్పుడు ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నెల క్రితం అంటే నవంబర్ 1వ తేదీన కమర్షియల్ సిలిండర్ పై రూ. 100 వడ్డింపు అమలు చేశారు. అయితే, అదే నెల 16వ తేదీన ఈ ధరను రూ. 57 తగ్గించారు. కానీ, మళ్లీ ఇప్పుడు పెంచారు.తాజా పెంపుతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ బండ ధర పెరిగింది. ఢిల్లీలో రూ. 1796.50, కోల్‌కతాలో రూ. 1908, ముంబైలో 1749, చెన్నైలో 1968.50గా దీని ధర ఉన్నది.

మరోవైపు విమాన ఇంధన ధరల్లో ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్‌ కంపెనీలు మరోసారి కోత విధించాయి. దిల్లీలో ఒక్కో కిలోలీటర్‌ ధర రూ.5,189.25 తగ్గి రూ.1,06,155.67కు చేరింది. ఏటీఎఫ్‌ ధరను తగ్గించడం ఈ నెలలో ఇది రెండోసారి. నవంబర్‌ ఒకటో తేదీన కిలోలీటర్‌పై రూ.6,854.25 తగ్గిన విషయం తెలిసిందే. అంతకుముందు జులై 1 నుంచి నాలుగు దశల్లో కంపెనీలు ఏటీఎఫ్‌ ధరను రూ.29,391.08 పెంచాయి. తాజాగా రెండుసార్లు తగ్గించడంతో విమానయాన సంస్థలపై కొంత మేర భారం తగ్గినట్లయింది.

మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 నెలలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62 దగ్గర ఉంది. చివరిసారి ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన 2022 మేలో ఇంధన రిటైల్‌ కంపెనీలు ధరల్ని సవరించాయి.

Tags

Read MoreRead Less
Next Story