Kamal Nath: ‘కమలం’ చెంతకు కమల్నాథ్?
![Kamal Nath: ‘కమలం’ చెంతకు కమల్నాథ్? Kamal Nath: ‘కమలం’ చెంతకు కమల్నాథ్?](https://www.tv5news.in/h-upload/2024/02/18/1192229-65d17fa4c4eeb-the-sources-however-added-that-the-party-bent-backwards-to-please-nath-185515390-16x9.avif)
సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం తప్పేలా లేదు. సీనియర్ అయిన తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని సన్నిహితుల వద్ద కమల్ నాథ్ వాపోయారని తెలుస్తోంది. రాజ్యసభ సీటు ఇవ్వాలని పెద్దలను కోరితే స్పందించలేదని, అందుకే గుర్రుగా ఉన్నారని వారు చెబుతున్నారు. రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడం కమల్ నాథ్ పార్టీ వీడేందుకు ఓ కారణమై ఉంటుందని స్పష్టంచేశారు. బీజేపీ నేతలతో కమల్ నాథ్, అతని కుమారుడు నకుల్ నాథ్ సంప్రదింపులు జరిపారనే వార్తలు గత కొద్దిరోజుల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ వీడొద్దని కమల్ నాథ్ను కాంగ్రెస్ పార్టీ కోరడం లేదు. దీంతో కమల్ నాథ్ బీజేపీలో చేరడం ఖాయం అని అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ మిగిలిన పార్టీలు ఒక్కొక్కటిగా దూరం జరుగుతున్నాయి. దీనికి తోడు అటు అధికార ఎన్డీఏ కూటమిలోకి కొత్త పార్టీలు, పాత మిత్రులు వచ్చి చేరుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సీనియర్ నేతలు, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్న నాయకులు కూడా పార్టీని వీడుతుండటం హస్తం పార్టీకి మింగుడు పడటం లేదు. అటు ఇండియా కూటమి నుంచి పార్టీలు.. ఇటు సొంత పార్టీ నుంచి నేతలు బయటికి పోతుండటం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ దళంలో చేరనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.
పార్టీ వీడుతున్నారనే ఊహాగానాల మధ్య శనివారం కమల్ నాథ్ ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ వీడే అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నాకు లేని తొందర మీకు ఎందుకు అని అడిగారు. ఏదైనా విషయం ఉంటే మీకే ముందు చెబుతా కదా అని సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీఎం పదవీ కోసం కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా పోటీ పడ్డారు. కమల్ నాథ్ వైపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొగ్గు చూపింది. దాంతో సింధియా కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు. మద్దతు దారులతో కలిసి బీజేపీలో చేరారు. తర్వాత మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం సాధించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com