Madhya Pradesh: కోట్ల లావాదేవీలు జరిపారంటూ విద్యార్థికి ట్యాక్స్ నోటీసులు.. తీరా చూస్తే

మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థికి ఆదాయపన్ను శాఖ నుంచి రూ.46 కోట్లకు ట్యాక్స్ నోటీసు వచ్చింది. రూ.46 కోట్ల లావాదేవీలపై పన్నులు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులు చూసిన సదరు విద్యార్థి షాక్కు గురయ్యాడు. ఈ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పాడు. ఈ మేరకు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు.
వివరాల్లోకి వెళితే ..
తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గ్వాలియర్కు చెందిన ప్రమోద్ కుమార్ దండోటియా అనే కాలేజీ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో తన పాన్కార్డ్ నెంబర్తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, తన పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు వాపోయాడు.
ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం మరోసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.పాన్కార్డును దుర్వినియోగం చేసి దాని ద్వారా ఒక కంపెనీని రిజిస్టర్ చేసి భారీ మొత్తంలో లావాదేవీలు జరిపినట్టుగా ఉన్నారని పేర్కొన్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com