Jayaprada: జయప్రదకు హైకోర్టులో ఎదురు దెబ్బ

జైలు శిక్షను రద్దుచేయాలని కోరుతూ ప్రముఖ సినీ నటి జయప్రద దాఖలు చేసిన అప్పీల్ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. 15 రోజుల్లో కోర్టులో లొంగిపోయి, రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తమ సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు గత 18 ఏళ్లుగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్సన్ కార్పొరేషన్ (ESIC) బకాయిలు చెల్లించనందుకు జయప్రదతో పాటు మరో ఇద్దరికి చెన్నైలోని ట్రయల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది
జయప్రద చెన్నైకి చెందిన రామ్కుమార్, రాజ్బాబులతో కలిసి అన్నాసాలైలో ఓ సినిమా థియేటర్ నడిపారు. అందులో సిబ్బందికి ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. విచారించిన కోర్టు జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా చొప్పున విధిస్తూ ఆగస్టులో తీర్పునిచ్చింది. దీనిపై ఆమె మద్రాసు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్ను కిందటిసారి విచారించిన న్యాయమూర్తి ఈఎస్ఐకి చెల్లించాల్సిన రూ.37.68 లక్షలు చెల్లించడం కుదురుతుందా? లేదా అనే విషయంపై జయప్రద వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రూ. 20 లక్షలు చెల్లిస్తామని ఆమె చెప్పారు. దీనిని ఈఎస్ఐ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. జయప్రద తదితరులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేశారు. తమ సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు గత 18 ఏళ్లుగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్సన్ కార్పొరేషన్ (ESIC) బకాయిలు చెల్లించనందుకు జయప్రదతో పాటు మరో ఇద్దరికి చెన్నైలోని ట్రయల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది.

80వ దశకంలో స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలిగారు జయప్రద. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు అందరు అగ్ర నటులతో నటించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె హవా నడిచింది. ఉత్తర్ ప్రదేశ్లోని రాంపూర్ నుంచి జయప్రద రెండు సార్లు సమాజ్వాదీ పార్టీ తరఫున లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009లో రాంపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత ఆర్ఎల్డీలో చేరిన జయప్రద.. 2014 ఎన్నికల్లో బిజ్నోర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీలో ఆమె చేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com