Madras High Court: హీరో విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్

మద్రాసు హైకోర్టులో నటుడు, టీవీకే అధినేత విజయ్ (Vijay)కు చుక్కెదురైంది. ఆదాయపన్ను శాఖ విధించిన పెనాల్టీకి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించగా.. విచారించిన న్యాయస్థానం విజయ్ పిటిషన్ను కొట్టేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దీనిపై 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇప్పుడు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
అందుకే జరిమానా..
2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసినప్పుడు ఆ ఏడాది విజయ్ రూ.35 కోట్లు ఆదాయం పొందినట్లు ఆదాయ పన్ను శాఖ మద్రాసు హైకోర్టులో నివేదిక దాఖలు చేసింది. అందుకు సంబంధించి మదింపు చేపట్టిన ఆదాయపన్ను శాఖ విజయ్ ఇంట్లో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను సరిచూడగా ‘పులి’ సినిమాకు తీసుకున్న రూ.15 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని తేలింది. ఆ ఆదాయాన్ని దాచినందుకు రూ.1.50 కోట్ల జరిమానా విధిస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ విజయ్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
విజయ్ నటించిన కొత్త సినిమా ‘జన నాయగన్’ (Jana Nayagan) వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్య కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడనే ఉత్కంఠ ఇంకా వీడలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
