Maha Kumbh Mela : ఘనంగా ముగిసిన కుంభ మేళా

ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా చివరిరోజైన బుధవారం భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి పర్వదినం కూడా కలిసిరావడంతో ‘హర హర మహాదేవ్’ నామస్మరణలతో త్రివేణీసంగమం ఘాట్లు మార్మోగాయి. కుంభమేళాలో చివరి అమృతస్నానం ఆచరించేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే పెద్దసంఖ్యలో ఘాట్ల వద్దకు చేరుకొన్నట్లు అధికారులు తెలిపారు. దేశం నలుమూలలతోపాటు నేపాల్ నుంచి కూడా భక్తుల బృందం ఒకటి తరలివచ్చింది. కుంభమేళా ప్రాంతంలోని అయిదు ప్రధాన శివాలయాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాలీవుడ్ ప్రముఖనటి ప్రీతి జింటా బుధవారం త్రివేణీసంగమంలో పుణ్యస్నానం చేశారు. కుంభమేళాకు తాను రావడం ఇది మూడోసారి అంటూ ఆమె తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో కలిసి గోరఖ్పుర్ కంట్రోల్ రూములో తెల్లవారుజామున 4 గంటల నుంచే ఏర్పాట్లను పర్యవేక్షించారు. జనవరి 13న మొదలై నాగ సాధువుల ఊరేగింపులు, మూడు అమృత స్నానాలతో వైభవంగా 45 రోజులపాటు కొనసాగిన మహా కుంభమేళా ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం 65 కోట్లమంది భక్తులు కుంభమేళాను సందర్శించి పుణ్యస్నానాలు చేశారు. జనవరి 29 నాటి రెండో అమృతస్నానం సందర్భంగా రద్దీ వల్ల జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు చనిపోయిన విషాద ఘటన రాజకీయ దుమారం రేపింది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ఛుక్, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, సినీతారలు, క్రీడాకారులు త్రివేణీసంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా భారత వాయుసేన పైలట్లు అద్భుతమైన వైమానిక విన్యాసాలు ప్రదర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com