Hathras Stampede : పోలీసుల ఎదుట లొంగిపోయిన 'హాథ్రస్' ప్రధాన నిందితుడు!
హాథ్రస్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు దేవప్రకాశ్ మధుకర్ పోలీసులు, సిట్, ఎస్టీఎఫ్ ఎదుట లొంగిపోయాడని అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 'దేవ్ ప్రకాశ్ మధుకర్ హాథ్రస్ సమావేశానికి ప్రధాన ఆర్గనైజర్గా ఉన్నారు. ఆయన ఏ నేరం చేయలేదు. మధుకర్ ఇప్పుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆయన ఒక హార్ట్ పేషెంట్. ఆయనకు ఏం జరగకూడదు. మేము ఎటువంటి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లం. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాం' అని ఏపీ సింగ్ అన్నారు. నిందితుడు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
అసలేం జరిగిదంటే..
జూలై 2న భోలే బాబా అనే పేరుతో ప్రాచూర్యం పొందిన ఓ ఆధ్యాత్మికవేత్త హత్రాస్ జిల్లాలోని ఫూల్రాయ్ గ్రామంలో ‘సత్సంగ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు, అనుచరులు హాజరయ్యారు. వారిని ఉద్దేవించి భోలే బాబా తన ప్రవచనాన్ని ఇచ్చారు. కార్యక్రమం పూర్తవుతుండగా ఒక్కసారిగా పెనుగులాట చోటుచేసుకుంది. భోలే బాబా పాదాలను తాకాలని భక్తులు పరుగెత్తారు.
దీంతో అనేక మంది కింద పడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కింద పడ్డ వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఊపిరి అందక ఆర్తనాదాలు చేస్తూ చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది మరణించారు. తొక్కిసలాటపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు సాక్ష్యాలను దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com