Bihar Scam: గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు..
స్టాక్ మార్కెట్లో అధిక రాబడులు, అధిక వడ్డీ, డిజిటల్ అరెస్టులు, హనీట్రాప్ ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా అప్రమత్తం చేస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే బిహార్లో ఏకంగా ఓ ముఠా.. సంతానం లేని స్త్రీలను గర్భవతులను చేస్తే భారీ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ప్రకటనలు గుప్పించి బాధితుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. ఈ తరహా మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేపట్టి ముఠా సభ్యులు పలువురిని అరెస్టు చేశారు. నవడా జిల్లాలో ఈ స్కామ్ బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’, ‘ప్లేబాయ్ సర్వీస్’ల పేరిట ఫేస్బుక్లో ఈ ముఠా సభ్యులు ప్రకటనలు ఇచ్చారు. పిల్లలు లేని స్త్రీలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు పొందవచ్చని ప్రకటించారు. ఒకవేళ వారు విఫలమైతే రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు సైతం పొందవచ్చని పేర్కొన్నారు. దీంతో ఆకర్షితులైన పలువురు ఆ ముఠాను సంప్రదించారు. మొదట ముఠా సభ్యులు బాధితుల నుంచి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ఫీ, ఇతర వివరాలు సేకరించారు. అనంతరం రిజిస్ట్రేషన్, హోటల్ గదుల బుకింగ్స్ పేరిట డబ్బు వసూలు చేశారు. ఒకవేళ బాధితులు ఇవ్వకుంటే వారిని బ్లాక్మెయిల్ చేసేవారు. ఈ వ్యవహారమై ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అనంతరం నిందితులు ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్లను అరెస్టు చేశారు. వారి నుంచి 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద బాధితుల వాట్సప్ ఛాట్, కస్టమర్ ఫొటోలు, ఆడియో రికార్డింగ్లు, బ్యాంక్ లావాదేవీలను గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com