కాంగ్రెస్‌కు టీఎంసీ మద్ధతు.. మమతా కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు టీఎంసీ మద్ధతు.. మమతా కీలక వ్యాఖ్యలు
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల టీఎంసీ మద్దతు ఇస్తుందని చెప్పారు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల టీఎంసీ మద్దతు ఇస్తుందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య విపక్ష కూటమి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో మమత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో మరింత జోష్ పెంచుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఐక్యతకు సంబంధించి టీఎంసీ వ్యూహాన్ని మమతా బెనర్జీ స్పష్టం చేయడం ఇదే తొలిసారి.

కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఆ పార్టీకి తాము సపోర్ట్‌గా నిలుస్తామన్నారు. అందులో తప్పేమీ లేదని... అయితే వారు కూడా ఇతర రాజకీయ పార్టీలకు సపోర్ట్‌గా నిలవాలన్నారు. సీట్ల కేటాయింపు ఫార్ములా విషయంలోనూ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

కర్ణాటక ఫలితాల్లో బీజేపీ అధికారం కోల్పోయిన వెంటనే మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలకు సెల్యూట్ చేశారు. కాంగ్రెస్ పేరు మాత్రం ఆమె ప్రస్తావించ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న మమతా బెనర్జీ ఆ తర్వాత పార్టీని వీడి టీఎంసీని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఐక్య కూటమి ఏర్పాటు అవసరాన్ని మమతా బెనర్జీ గట్టిగా చెబుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల ఆ ప్రయత్నాలను వేగవంతం చేశారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను కలుసుకుంటున్నారు. జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్‌‌ను కలుపుకోకుండా విపక్ష ఐక్యత సాధ్యం కాదనే సంకేతాలు కూడా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story