Karnataka :పాము కాటుకి చచ్చి బతికాడు

Karnataka :పాము కాటుకి చచ్చి బతికాడు
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా మళ్లీ లేచి కూర్చున్న వ్యక్తి

కర్ణాటకలోని గదగ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి పాము కాటుతో మరణించాడనుకుని కుటుంబసభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అంతా రెడీ అనుకున్న సమయానికి అతడు లేచి కూర్చున్నాడు. దీంతో అతనిని హడావిడిగా ఆసుపత్రిలో చేర్చారు.. ఇప్పుడు కోలుకుంటున్నాడు.

హీరేకొప్ప గ్రామంలో ఓ వ్యక్తి పాములు పట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఎవరింట్లో అయినా పాము కనపడింది అనగానే ఇతనికి సమాచారం అందుతుంది. వెంటనే ఫుల్లుగా మందు కొట్టి రంగంలోకి దిగుతాడు. పాముని పట్టి బయట వదిలేస్తాడు. వాళ్ళు ఇచ్చిన పదో పరకో తీసుకొని వెళ్ళిపోతాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. అయితే ఇటీవల సిద్ధప్ప మద్యం మత్తులో ఉండగానే ఓ పామును పట్టుకున్నాడు. తన చేతిలో గరుడ రేఖ ఉందని, పాము తనను కాటేయదని డైలాగులు చెబుతూ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. కాసేపు దానితో ఆడాడు. తరువాత పాముని రోడ్డు పైన వదిలేసాడు. తరువాత మళ్ళీ ఏం ఆలోచించాడో ఏమో మళ్ళీ పాము వెనుక వెళ్ళాడు. రోడ్డు పక్కన మొక్కలోకి వెళ్లిపోతున్న దానిని పట్టుకోవడానికి ప్రయత్నించ్చాడు. చివరికి పట్టుకున్నాడు. కానీ ఈసారి పాముకి వళ్ళు మండింది.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు కాటేసింది..ఇదేమీ పట్టించుకోని సిద్ధప్ప పామును తీసుకుని నడుస్తూ అలా రోడ్డు మీదే కుప్పకూలిపోయాడు. ఎంత ప్రయత్నించినా లేవక పోవడంతో అతడు చనిపోయాడని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

అప్పుడే సడన్ గా సిద్ధప్ప లేచి కూర్చున్నాడు. దీంతో, షాకైపోయిన కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సిద్ధప్ప కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story