Manipur: మళ్లీ మండుతోన్న మణిపూర్

Manipur: మళ్లీ మండుతోన్న మణిపూర్
X
చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాలయానికి తాళం... ఇంటర్నెట్ బంద్

మణిపూర్‌... మళ్లీ మండుతోంది. మహిళలు, పిల్లలను కుకీ మిలిటెంట్లు హత్య చేయడంపై పలు చోట్ల నిరసనలు, హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఆందోళనలు హింసాత్మక రూపు తీసుకోవడంతో మణిపూర్ లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. నిరసనకారులు కర్ఫ్యూను ఉల్లంఘించి యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు. జిరిబమ్‌ జిల్లాలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లల హత్యకు నిరసనగా కోఆర్డినేషన్‌ కమిటీ ఆన్‌ మణిపూర్‌ ఇంటిగ్రిటీ గ్రూపునకు చెందిన కొందరి నేతృత్వంలో జనం ఇంపాల్‌ పశ్చిమ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జిరిబమ్‌ జిల్లాలో హత్యకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ నిరసనకారులు ఇంపాల్‌లోని చీఫ్‌ ఎలక్టొరల్‌ ఆఫీసర్‌ కార్యాలయంలోకి చొచ్చుకుపోయి ప్రధాన గేటుకు తాళం వేశారు. సమీపంలోని పలు కార్యాలయాలకు ఇదేవిధంగా తాళాలు వేశారు. ఆందోళనకారులు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడికి దిగారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో అధికారులు 8 జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్‌ వెస్ట్, బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్‌, తౌబల్స కాక్‌చింగ్, కాంగ్కోక్పి, చురాచాంద్‌పూర్‌లో రెండ్రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డాటా సర్వీసులను నిలిపివేశారు. కుకి మిలిటెంట్లపై సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇంపాల్‌లో కొకొమి చేపట్టిన ధర్నా మూడోరోజుకు చేరుకుంది. మణిపూర్‌ ప్రభుత్వం సోమవారం నుంచి బుధవారం వరకు ఏడు జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసింది.

హోంమంత్రి అమిత్ షా సమీక్ష

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వరుసగా రెండోరోజు మణిపూర్‌పై కేంద్ర, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మరో 5 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని ఆ రాష్ట్రానికి పంపాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులు ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టి వెంటనే అక్కడ శాంతి భద్రతలను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇప్పటికే సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఏడీ సింగ్‌, ఇతర కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఉన్నతాధికారులు ఆ రాష్ట్రంలో మకాం వేసి ఉన్నారు. ఇప్పటికే మణిపూర్ లో గత వారం పంపిన కేంద్ర సిబ్బందితో కలిపి మొత్తం 218 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. కాగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మణిపూర్‌లో తాజాగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి మూడు కేసులను నమోదు చేసింది. జిరిబమ్‌ జిల్లాలో మహిళల హత్య.. సీఆర్‌పీఎఫ్‌ పోస్టుపై సాయుధ మూక దాడి.. బొరొబెక్రలో ఇళ్ల దహనం, ఒకరి హత్యకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది.

బీజేపీపై విమర్శలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాక ముందే ప్రధాని మోదీ కల్లోలిత మణిపూర్‌ రాష్ట్రంలో పర్యటించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. మణిపూర్‌లో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయాలని కోరింది. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మణిపూర్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కె. మేఘచంద్ర సింగ్‌, ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ గిరీష్‌ చోడంకర్‌లతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నవంబరు 25న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకముందే ఆ రాష్ట్రంపై జాతీయ స్థాయిలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జూలై 31 నుంచి మణిపూర్‌కు పూర్తిస్థాయి గవర్నర్‌ కూడా లేరని పేర్కొన్నారు. పాలనలో విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని హోం మంత్రి ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు.

Tags

Next Story