Manish Sisodia: లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో సిసోడియాకు ఎదురుదెబ్బ..

Manish Sisodia: లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో సిసోడియాకు ఎదురుదెబ్బ..
బెయిల్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీష్‌ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, మనీలాండరింగ్‌ కేసుల్లో సిసోడియాకు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్‌ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో పలు దశల్లో వాదనలు జరిగాయి. ఆ తరువాత తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిల ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. ఈకేసులో 338 కోట్లు చేతులు మారాయనేందుకు ఆధారాలున్నాయని అభిప్రాయపడిన ధర్మాసనం దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించింది. ఫలితంగా మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. అయితే మనీష్ సిసోడియాపై విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలంటూ డెడ్‌లైన్ విధించింది సుప్రీంకోర్టు.

గతంలో సిసోడియా దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిల్‌ దరఖాస్తులపై అక్టోబర్‌ 17న తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం.. తాజాగా తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ తమకు అందించినట్లు కోర్టు తెలిపింది. లిక్కర్‌ స్కామ్‌లో రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలను చూపించినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇక ఈ లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే.. మూడు నెలల్లోపు సిసోడియా మళ్లీ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సుప్రీం పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణంతో మనీష్‌ సిసోడియాకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏడాదిన్నర క్రితం సీబీఐ, ఈడీ అధికారులు సిసోడియాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్‌ స్కామ్‌ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రెండూ విచారిస్తున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story