మాతృహృదయం.. ఖైదీ బిడ్డకు పాలు పట్టిన పోలీసమ్మ
పసిబిడ్డ ఏడుపు చూస్తే తల్లి మనసు తల్లడిల్లుతుంది. అది మాతృహృదయం మమకారం. ఓ ఖైదీ బిడ్డకు తన స్థన్యం ఇచ్చి అమ్మ మనసుని చాటుకుంది ఆ పోలీసమ్మ. ఆమె చేసిన పనికి అందరిచేత ప్రశంసలందుకునేలా చేస్తోంది.
ఆర్య శైలజన్ అనే కేరళ మహిళా పోలీసు.. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన నాలుగు నెలల పాపకు పాలిచ్చి అందరి హృదయాలను గెలుచుకుంది. పసికందు తల్లి పాట్నాకు చెందినది. ఆమె భర్త వలస కార్మికుడు ఇక్కడ జైలులో ఉన్నాడు. అతడిని చూసేందుకు వచ్చి అనారోగ్యంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అనారోగ్య సమస్య కారణంగా తమ తల్లి చేరిన ఆసుపత్రిలో నలుగురు పిల్లలు ఉన్నారని కంట్రోల్ రూమ్ నుండి కాల్ వచ్చింది శైలజకు.“కాల్ వచ్చిన వెంటనే మా స్టేషన్ నుండి ఒక బృందం ఆసుపత్రికి చేరుకుంది. నలుగురు పిల్లలను తీసుకుని స్టేషన్కు వచ్చాము. పిల్లలందరూ ఆకలితో ఉన్నారని మేము గమనించాము. 13, 5, 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఆహారాన్ని తీసుకువచ్చి ఇచ్చాము. కానీ నాలుగు నెలల పాపకు తల్లిపాలు అవసరమవుతాయి. ఆ చిన్నారి ఆకలితో ఏడుస్తోంది. అది చూసి నేను ఫీడింగ్ మదర్ అని, ఆ చిన్నారికి పాలివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని మా పై అధికారికి చెప్పాను, ”అని శైలజన్ చెప్పారు.
“అధికారి అంగీకరించడంతో నేను శిశువుకు పాలు ఇచ్చాను. నేను బిడ్డకు పాలు ఇవ్వగలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, నాకు తొమ్మిది నెలల పాప ఉంది, తనకు నేను పాలు ఇస్తున్నాను, ”అని శైలజన్ తెలిపారు. పాట్నా దంపతులకు ఐదుగురు పిల్లలు. అందులో ఒకరు పాట్నాలో నివసిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com