Haryana : ఫేక్ సర్టిఫికెట్తో 50కి పైగా గుండె ఆపరేషన్లు చేసిన ఎంబీబీఎస్ డాక్టర్!

హర్యానాలోని ఫరీదాబాద్లో వైద్యరంగంలోనే అత్యంత దారుణమైన మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. కేవలం ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే ఉన్న ఒక వైద్యుడు ఏకంగా కార్డియాలజిస్ట్గా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో 50కి పైగా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఫరీదాబాద్లోని బాద్షా ఖాన్ సివిల్ ఆసుపత్రిలో డాక్టర్ పంకజ్ మోహన్ శర్మ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సుమారు ఎనిమిది నెలలకు పైగా కార్డియాలజిస్ట్గా చలామణి అవుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించాడు. వాస్తవానికి అతడికి ఎంబీబీఎస్ పట్టా మాత్రమే ఉంది. గుండె వంటి కీలకమైన అవయవాలకు సంబంధించిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడానికి అతనికి ఎలాంటి అధికారిక అర్హత లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకిలీ వైద్యుడు, ప్రస్తుతం ప్రాక్టీస్లో ఉన్న మరో నిజమైన కార్డియాలజిస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అతడితో సర్జరీ చేయించుకున్న అనేక మంది రోగులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని, వారిలో కొందరు మరణించినట్లు కూడా సమాచారం.
మోసం బయటపడిందిలా..
ఈ దారుణం ఒక రోగి ద్వారానే వెలుగులోకి వచ్చింది. డాక్టర్ శర్మ చేతిలో చికిత్స పొందిన ఒక రోగి, అనుమానంతో అసలు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కార్డియాలజిస్ట్ను సంప్రదించడంతో విషయం బయటపడింది. దీనితో ఆసుపత్రి యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది. విచారణలో డాక్టర్ పంకజ్ మోహన్ శర్మ సమర్పించిన పత్రాలు నకిలీవని తేలింది.
నకిలీ పత్రాలతో మోసం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ పంకజ్ మోహన్ శర్మను తక్షణమే విధుల నుంచి తొలగించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కీలకమైన గుండె ఆపరేషన్లు చేయడానికి అతనికి ఎలాంటి అధికారం లేదని, ఇది చాలా తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com