APP: సత్యేందర్‌ జైన్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే

APP:  సత్యేందర్‌ జైన్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
ఆప్‌కు మరో షాక్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీకిమరో షాక్ తగిలింది. తిహాడ్‌ జైల్లో ఉన్న ఆ పార్టీ నేత, మంత్రి సత్యేందర్‌ జైన్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ అనుమతిచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ చేత దర్యాప్తు కోరుతూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా దర్యాప్తునకు అనుమతిచ్చింది. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తన నుంచి బలవంతంగా రూ.10 కోట్లు వసూలుచేశారన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ ఆరోపణలపై ఈ దర్యాప్తు జరగనుంది. ఓవైపు ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉండగా.. తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

జైల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు గానూ గతంలో జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్‌ జైన్‌ తన నుంచి రూ.10 కోట్లు బలవంతంగా తీసుకున్నారని సుకేశ్‌ ఆరోపించాడు. ఈ మేరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అతడు లేఖ రాశాడు. ఈ వ్యవహారంలో జైన్‌ సహా తీహార్‌ జైలు మాజీ డీజీ సందీప్‌ గోయెల్‌ నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిపై సుకేశ్‌.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖలో అనేక విషయాలు పేర్కొన్నాడు. ‘2015 నుంచి సత్యేంద్రజైన్‌తో నాకు పరిచయం ఉంది. దక్షిణాదిలో కీలక పదవి అప్పగిస్తానని, పార్టీ విస్తరణ తర్వాత రాజ్యసభకు నామినేట్‌ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాకు హామీ ఇచ్చింది. అందువల్ల ఆ పార్టీకి నేను రూ.50 కోట్లకు పైగా డబ్బు సమకూర్చాను. 2017లో నేను అరెస్టయిన తర్వాత తిహాడ్‌ జైల్లో ఉంచారు. అప్పుడు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్‌ నన్ను కలిశారు. ఆమ్‌ఆద్మీ పార్టీకి ఇచ్చిన డబ్బు గురించి దర్యాప్తు సంస్థలకు ఏమైనా చెప్పావా? అని అడిగారు. ఆ తర్వాత 2019లో మరోసారి అరెస్టయినప్పుడు సత్యేంద్రజైన్‌ తన సెక్రటరీ, మరో సన్నిహితుడితో జైలుకు వచ్చి నన్ను కలిశారు. జైల్లో రక్షణ, సదుపాయాలు కల్పించాలంటే ప్రతినెలా తనకు రూ.2 కోట్లు కట్టాలని జైన్‌ డిమాండ్ చేశారు. అంతేగాక డీజీ (జైళ్లు) సందీప్‌ గోయెల్‌కు ప్రతినెలా రూ.1.5 కోట్లు ఇవ్వాలని చెప్పారు. నాపై ఒత్తిడి పెంచి కొన్ని నెలలు బలవంతంగా కట్టించుకున్నారు. అలా సత్యేంద్ర జైన్‌కు రూ.10కోట్లు, సందీప్‌ గోయెల్‌కు రూ.12.5 కోట్లు చెల్లించా’’ అని సుకేశ్‌ తన లేఖలో పేర్కొన్నాడు. ఇప్పుడు దీనిపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. సత్యేంద్ర జైన్‌ కూడా అవినీతి కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు.

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఏడాది నుంచి జైల్లో ఉన్నారు. ఇక ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా గోవా ఆప్ లీడర్లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇలా ఒక్కొక్కరు ఈ కేసుల్లో ఇరుక్కుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story