MiG 21 Retirement: ఆకాశంలో ముగిసిన మిగ్-21 శకం.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

భారత వాయుసేన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. సుమారు 62 ఏళ్ల పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక మిగ్-21 యుద్ధ విమానాలు సేవల నుంచి శాశ్వతంగా వైదొలిగాయి. ఈ సందర్భంగా చండీగఢ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఈ రోజు అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వయంగా మిగ్-21 విమానంలో చివరిసారిగా ప్రయాణించి ఈ శకానికి ముగింపు పలికారు.
ఈ వీడ్కోలు కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి తదితర త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 'పాంథర్స్' అనే ముద్దుపేరున్న 23వ స్క్వాడ్రన్కు చెందిన చివరి మిగ్-21 విమానాలకు సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలికారు. విమానాలు ల్యాండ్ అయిన తర్వాత వాటర్ క్యానన్ సెల్యూట్తో గౌరవ వందనం సమర్పించారు.
1965, 1971 యుద్ధాల్లో పాకిస్థాన్ విమానాలను కూల్చివేసి భారత వాయుసేన సత్తాను ప్రపంచానికి చాటిన మిగ్-21, 1999 కార్గిల్ యుద్ధంలోనూ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా, 2019 బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మిగ్-21తోనే కూల్చివేసి చరిత్ర సృష్టించారు. ఈ ఘటనతో మిగ్-21 సామర్థ్యం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ, మిగ్-21 నడిపిన చివరి మహిళా ఫైటర్ పైలట్గా నిలిచారు. పాత తరం పైలట్లు సైతం ఈ కార్యక్రమానికి హాజరై, మిగ్-21తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై మిగ్-21 స్థానంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్' సేవలు అందించనుంది. "ఆరు దశాబ్దాల సేవ, లెక్కలేనన్ని ధైర్యసాహసాల గాథలు, దేశ గర్వాన్ని ఆకాశానికి మోసుకెళ్లిన యుద్ధ అశ్వం" అంటూ భారత వైమానిక దళం మిగ్-21కు ఘన నివాళి అర్పించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com