Tamil Nadu: స్టాలిన్ సర్కార్ గుడ్న్యూస్.. అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు స్టాలిన్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. మహిళలకు బొనాంజా అందించింది. మహిళల ఖాతాల్లో రూ.5,000 చొప్పున జమ చేసింది. శుక్రవారం ఉదయమే 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు నగదు జమ అయింది. ఉదయాన్నే మొబైల్ చూసిన మహిళలు నగదు జమ కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్టాలిన్ ప్రభుత్వం కలైంగర్ మహిళా హక్కుల పథకం కింద ప్రతి నెల రూ.1,000 అందిస్తుంది. ఇప్పుడు ఈ పథకాన్ని రూ.2,000కు పెంచింది. ఇంతలోనే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన 3 వేలతో పాటు వేసవి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.2 వేలు జత చేసి మొత్తంగా శుక్రవారం ఉదయం రూ.5,000 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేసింది. 1.31 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఉదయం రూ. 5,000 జమ చేయబడింది.
‘‘తమిళనాడు మహిళలకు.. ఈ మహిళా హక్కుల గ్రాంట్ స్టాలిన్ ఇచ్చిన హామీ. ఎవరు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినా నేను దాని నుంచి వెనక్కి తగ్గను. ఎన్నికలను ఒక కారణంగా చూపుతూ మూడు నెలలుగా మహిళా హక్కుల గ్రాంట్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన ద్రవిడ మోడల్ ప్రభుత్వం వారికంటే ముందుగానే వ్యవహరించింది!. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు ముందస్తుగా రూ. 3,000, రూ. 2,000 వేసవి ప్రత్యేక ప్యాకేజీతో పాటు! కలైంగర్ మహిళా హక్కుల పథకం యొక్క 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ ఉదయం మొత్తం రూ. 5,000 జమ చేయబడింది. ద్రవిడ మోడల్ 2.0 కింద మేము రూ. 1,000 మహిళా హక్కుల గ్రాంట్ను రూ. 2,000కి పెంచుతాము! ఇది కరుణానిధి స్టాలిన్ నా సోదరీమణులకు ఇచ్చే వాగ్దానం!.’’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఆదివారం ఎన్నికల సంఘం తమిళనాడులో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. అనంతరం సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్లో ఎన్నికల ప్రక్రియను ముగించవచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాడుతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం షెడ్యూల్ కూడా విడుదల కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
