Amit Shah: ముఖ్యమంత్రి స్టాలిన్పై అమిత్ షా విసుర్లు

ఇంజినీరింగ్, వైద్య విద్యను తమిళ భాషలో బోధించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. హిందీ భాషను వ్యతిరేకిస్తూ స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్గా అమిత్ షా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషల్లో పరీక్షలు రాసే వీలు కల్పించిందని, ఇప్పుడు సీఐఎస్ఎఫ్ పరీక్షను తమిళంలోను రాయవచ్చు అని మంత్రి పేర్కొన్నారు. తమిళనాడులోని రాణిపేట్లో జరిగిన 56వ సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే ఈవెంట్లో పాల్గొని ఆయన మాట్లాడారు.
తమిళ విద్యార్థుల లబ్ధి కోసం ఇంజినీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో బోధించాలని సీఎం స్టాలిన్ను కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు. భారతీయ సంస్కృతిని బలోపేతం చేయడంలో తమిళనాడు కీలక పాత్ర పోషించిందన్నారు. పరిపాలనా సంస్కరణలైనా, ఆధ్మాత్మిక చింతనైనా, విద్య అయినా.. దేశ సమగ్రత, ఐక్యత అయినా తమిళనాడు పాత్రను విస్మరించలేమన్నారు.
శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్పై విమర్శలు గుప్పించారు. ఎల్కేజీ స్టూడెంట్.. పీహెచ్డీ హోల్డర్కు బోధించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళ భాష కోసం ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేసింది ఏమీలేదన్నారు. ప్రాంతీయ భాషలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది ప్రధాని మోడీ ప్రభుత్వమేనన్నారు. ఇప్పటి వరకు సీఏపీఎఫ్ నియామకాల్లో మాతృభాషకు స్థానం లేదన్నారు. కానీ యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఎనిమిదవ షెడ్యూల్లో మార్పులు చేశామని.. దీంతో సీఏపీఎఫ్ పరీక్షను ఇప్పుడు తమిళంలో కూడా రాయగల్గుతున్నారని పేర్కొన్నారు. స్టాలిన్.. ప్రాంతీయ భాషకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని అడిగారు. వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల పాఠ్యాంశాలను వీలైనంత త్వరగా తమిళ భాషలో ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com