Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఘర్షణ పడ్డ ఎమ్మెల్యేలు

వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని జమ్మూకశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో గత మూడు రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతుంది. అయితే, ఇవాళ (ఏప్రిల్ 9న) కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. దీంతో శాసన సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో లోపల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యేలు.. ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు.
అయితే, గత రెండు రోజుల నుంచి కూడా జమ్ము కశ్మీర్ అసెంబ్లీని స్పీకర్ అబ్దుల్ రహీమ్ క్రమంగా వాయిదా వేస్తున్నారు. ఈరోజు కూడా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, దీనిపై భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ కూడా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరి కొందరు ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. ఇక, అసెంబ్లీ సమావేశాలకు ప్రతిష్టంభన ఏర్పడింది.. దాంతో హౌజ్ను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com