Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు..

అపర కుబేరుడు , రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలో మూడోసారి బెదిరింపు మెయిల్ రావడం సంచనలంగా మారింది. ఇప్పటికే వరుసగా రెండు రోజుల్లో రెండు సార్లు బెదిరింపులు రాగా ఇప్పుడు మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈసారి దుండగులు ఏకంగా 400 కోట్లు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారత దిగ్గజ వ్యాపార వేత్త ఆసియాలోనే అత్యంత కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి 20 కోట్లు కోరుతూ మొదటి బెదిరింపు ఇ-మెయిల్ వచ్చింది. ఆ తర్వాత 200 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ మరో ఇమెయిల్ వచ్చింది. ఈ రెండు మెయిల్లకు ఎలాంటి స్పందన రాకపోవడంతో 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంబానీకి మూడో బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ ఇ-మెయిళ్లపై అంబానీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.
ముకేశ్ అంబానీకి వచ్చిన బెదిరింపు మెయిల్స్ ఒకే అకౌంట్ నుంచి వచ్చాయని పోలీసులు తెలిపారు. షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి ఖాతా నుంచి ఈ మెయిల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యక్తి యూరప్ నుంచి నుంచి మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మొదటగా అక్టోబర్ 27న 20 కోట్లు డిమాండ్ చేస్తూ షాదాబ్ ఖాన్ అనే పేరు ఉన్న ఖాతా నుంచి ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ తర్వాత అదే ఈమెయిల్ ఐడీ నుంచి వరుసగా బెదిరింపులు వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తమ వద్ద ఉన్న షూటర్లు చంపేస్తారంటూ అందులో నిందితుడు హెచ్చరించాడు. గత ఏడాది కూడా ముకేశ్ అంబానీ, అతని కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ చేసిన బిహార్లోని దర్భంగాకు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలో రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిని పేల్చేస్తామని కూడా గతంలో దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com