Mulayam Singh Yadav : ముగిసిన ములాయం అంత్యక్రియలు..
Mulayalam Singh Yadav : సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిసాయి. కుమారుడు అఖిలేష్ యాదవ్ ములాయం చితికి నిప్పంటించాడు. ములాయం స్వగ్రామం సైఫాయ్లో అధికార లాంఛనాలతో యూపీ ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించింది. అంత్యక్రియలకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తమ ప్రియతమన నేతను కడసారి చూసుకున్నారు. అశ్రునయాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. నేతాజీ అమర్ రహే నినాదాలతో సైఫాయ్ గ్రామం మారుమోగింది.
అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ భౌతికకాయం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. పార్టీ ఎంపీలు, నేతలతో కలిసి సైఫాయ్కు వెళ్లిన చంద్రబాబు.. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్తోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ములాయం అంత్యక్రియల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు.
అదేవిధంగా ములాయం భౌతికకాయం వద్ద సీఎం కేసీఆర్ అంజలి ఘటించారు. అనంతరం ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. ములాయం అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొన్నారు. మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ సైతం ములాయం భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ములాయం అంత్యక్రియలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీహీర్ సీఎం నితీశ్ కుమార్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ములాయం మృతితో ఉత్తరప్రదేశ్లో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది యోగి ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com