Mumbai : 2 నెలలకుపైగా ముంబై వృద్ధురాలి ‘డిజిటల్ అరెస్టు’

సైబర్ మోసాల్లో దిగ్భ్రాంతికరమైన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్టు’ స్కామ్లో ఓ ముంబై వృద్ధురాలు (86) ఏకంగా రూ.20.25 కోట్లు నష్టపోయారు. నిరుడు డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు జరిగిన ఈ మోసం భారత్లో సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన ‘డిజిటల్ అరెస్టు’ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచింది. పోలీస్ అధికారులమని చెప్పుకుంటూ కొందరు సైబర్ కేటుగాళ్లు ఆ వృద్ధురాలికి ఫోన్ చేశారు. ఆమె ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, దాని సాయంతో బ్యాంకు ఖాతా తెరిచి మనీ లాండరింగ్ సహా పలు ఇతర అక్రమ కార్యకలాపాలను నిర్వహించినందుకు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నామని బెదిరించారు. నేరానికి పాల్పడినట్టు అంగీకరించకపోతే ఆమె కుటుంబాన్ని సైతం కేసులో చేర్చుతామని భయపెట్టారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలు, కుంభకోణాలకు అంతు లేకుండా పోతున్నది. ఒక్క 2024 ఏడాదిలో భారతీయులు సుమారుగా రూ.2 వేల కోట్లు నష్టపోయారని ‘నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (ఎన్సీఆర్పీ) నివేదిక పేర్కొన్నది. 2025లో మొదటి రెండు నెలల్లో 17,718 కేసులు నమోదుకాగా, బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.210 కోట్లు కొల్లగొట్టారని తెలిసింది. డిజిటల్ అరెస్టు స్కామ్ కేసులు.. గత మూడేండ్లలో భారీగా పెరిగాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. కేసుల సంఖ్య మూడు రెట్లు, బాధితులు కోల్పోయిన సొమ్ము 20 రెట్లు పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com