Satyadev Fauji: యూపీలో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురి అనుమానాస్పద మృతి

ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా పెను కలకలం రేపింది. భర్తే తన భార్య, ముగ్గురు పిల్లలను కిరాతకంగా హతమార్చి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అమన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ పంపు దగ్గర సత్యదేవ్ ఫౌజీ అనే వ్యక్తి వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. గత రెండు రోజులుగా అతని ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. శనివారం ఉదయం ఆ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో, చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి చూడగా, ఒకే గదిలో ఐదు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి.
మృతదేహాల పరిస్థితిని బట్టి చూస్తే, ఈ ఘోరం జరిగి కనీసం రెండు రోజులు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతులను సత్యదేవ్, అతని భార్య, ముగ్గురు పిల్లలుగా గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలు సేకరించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అసలు ఈ దారుణానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆర్థిక సమస్యలా లేక కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సత్యదేవ్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
