Maoist’s Letter: పాకిస్థాన్ కోరితే కాల్పుల విరమణ మేం కోరితే చేయరా?

ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లోని నారాయణ్పూర్ సమీపంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో తమకు చెందిన 28 మంది సభ్యులు మరణించారని మావోయిస్టు వర్గాలు ప్రకటించాయి. మరణించిన వారిలో కీలక నేత బసవరాజు అలియాస్ కేశవరావు కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప పేరుతో మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు.
లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని అందులో పేర్కొన్నారు. నంబాల గత 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని చెప్పారు. కేశవరావు టీమ్ లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవల పోలీసులకు లొంగిపోయారు.. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఈ దారుణం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు ఒకరు సైతం ద్రోహిగా మారాడని ఆ లేఖలో మావోయిస్టులు రాసుకొచ్చారు.
ఇక, ఎన్ కౌంటర్ కు ముందురోజు నుంచి 20 వేల మంది బలగాలు తామున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి.. 10 గంటల్లో ఐదుసార్లు కాల్పులకు దిగింది అని మావోయిస్టులు లేఖలో తెలిపారు. 60 గంటల పాటు భద్రతా బలగాలు తమను నిర్బంధించాయి.. అప్పటికే నంబాల కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చాలా ప్రయత్నించగా.. తమను వదిలి వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదని వెల్లడించారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని తమతోనే ఉన్న కేశవరావు కోసం 35 మంది ప్రాణాలు అడ్డుపెడితే.. ఏడుగురం సురక్షితంగా బయట పడ్డాం.. మిగిలిన వారందరూ ఎన్ కౌంటర్లో చనిపోయారని ఆ లేఖలో ప్రస్తావించారు.
అయితే, ఇప్పటికే తాము కాల్పుల విరమణ ప్రకటించినట్లు చెప్పారు.. దేశ సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా పాకిస్తాన్తో కాల్పుల విరమణ చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. మాతో శాంతి చర్చలు జరిపేందుకు రెడీగా లేకపోవడం గమనార్హం అని లేఖలో రాసుకొచ్చారు. ఈ విషయంపై మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం పునరాలోచించాలని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com