PM Modi: 1 మహిళల అభివృద్ధిపై ప్రధాని ఆసక్తికర ట్వీట్

మహిళల అభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు. మహిళల నేతృత్వంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. కేంద్రంలో వరుసగా మూడోసారి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటై రేపటికి ఏడాది పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలోనే 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
‘‘విద్యా, క్రీడలు, స్టార్టప్, సైన్స్ ఇలా అన్ని రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపైనా మన దేశ కీర్తిని పెంచుతున్నారు. అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. స్వచ్ఛ భారత్ ద్వారా వారి గౌరవాన్ని కాపాడడం నుంచి జన్ధన్ ఖాతాలతో వారిని ఆర్థికంగా బలోపేతం చేసేంత వరకు ఎన్నో పథకాలు అమలు చేశాం.
పేద మహిళల ఆరోగ్యం దృష్ట్యా ‘ఉజ్వల్ యోజన’ పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందించాం. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’తో పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చాం. ప్రతి ఆడబిడ్డను రక్షించేందుకు, వారు ఉన్నతంగా ఎదిగేందుకు ‘బేటీ బచావో, బేటీ పడావో’ను అమలు చేశాం. పేదలు, రైతులు, యువత కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరంతా చూశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా 11 ఏళ్లుగా కృషి చేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com