Netaji Statue : నేతాజీ 28 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

Netaji Statue : నేతాజీ 28 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..
Netaji Statue : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు

Netaji Statue :ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. విజయ్‌ చౌక్‌ నుంచి ఇండియా గేట్‌వరకు సెంట్రల్‌విస్టా అవెన్యూ ప్రారంభోత్సవానికి ముందు ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని.. సెంట్రల్‌ విస్టా అవెన్యూని ప్రారంభించారు.

నేతాజీ సేవలను తరతరాలకు చాటేందుకు ఇండియా గేట్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి ఖమ్మం జిల్లా గ్రానైట్‌ వినియోగించారు. ప్రఖ్యాత కళాకారుడు అరుణ్ యోగిరాజ్‌ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశారు. దేశంలోనే ఎత్తయిన ఏకశిలా విగ్రహాల సరసన నేతాజీ విగ్రహం చేరింది.

ఇంకోవైపు, ఢిల్లీలో కీలక ప్రాంతమైన రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా కేంద్రం మార్చింది. మౌలిక సదుపాయాల పరంగా రాజ్‌పథ్‌లో అనేక మార్పులు చేశారు. ప్రజాసాధికారతకు చిహ్నంగా నిలిచే ఈ కర్తవ్యపథ్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇండియా గేట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ఉండే రాజ్‌పథ్‌ను వలసవాద విధానాలు, చిహ్నాల మార్పే లక్ష్యంగా కర్తవ్యపథ్‌గా నామకరణం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కర్తవ్యపథ్‌లో ఆహార స్టాళ్లు, వాక్‌వేలు, హరిత వనాలు, దారిపొడువునా 16 వంతెనలు, రెండుచోట్ల బోటింగ్‌, 1125 వాహనాలు పార్కింగ్‌ చేసేలా అవకాశం ఉండనుంది. అలాగే, విక్రయశాలలు, పార్కింగ్ ప్రదేశాల్లో 24గంటల పాటు భద్రత ఉండనుంది.

ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చెక్కడానికి శిల్పుల బృందం దాదాపు 26 వేల గంటల సమయం పట్టింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. పైగా ఈ భారీ శిలను తెలంగాణలోని ఖమ్మం నుంచి న్యూఢిల్లీకి 16 వందల 65 కిలోమీటర్లు తరలించేందుకు ప్రత్యేకంగా 140 చక్రాలతో 100 అడుగుల పొడవైన ట్రక్కును రూపొందించారు.

280 మెట్రిక్ టన్ను బరువైన బ్లాక్ గ్రానైట్ నుంచి 65 మెట్రిక్ టన్నుల బరువున్న ఏకశిలా సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని పూర్తిగా సాంప్రదాయ పద్ధతుల్లో, ఆధునిక పరికరాలను ఉపయోగించి చేతితో చెక్కడం జరిగిందని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రాంతంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Tags

Next Story