Assam: ఆధార్ కార్డుల జారీపై అస్సాం కొత్త రూల్

ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ కార్డు జారీ కావాలంటే జాతీయ పౌర నమోదు దరఖాస్తు నంబర్ను సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డుల జారీ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిమంత శర్మ తెలిపారు. అస్సాంలో ఆధార్ కార్డుల జారీ ఇక ఎంతమాత్రం సులభం కాదని పేర్కొన్నారు. పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, వారిని గుర్తించే ప్రక్రియను తాము వేగవంతం చేసినట్లు హిమంత శర్మ చెప్పారు. రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దీంతో సరిహద్దు దగ్గర నిఘాను కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. సరిహద్దు భద్రత కోసం బీఎస్ఎఫ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళతామని తెలిపారు
ఇటీవల జరిగిన అల్లర్లతో బంగ్లాదేశ్ అట్టుడుకుంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. హిందూవులపై దాడులు పెరిగిపోయాయి. దీంతో అనేక మంది భారత్లోకి వచ్చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశించడంతో ఆధార్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం రూల్స్ మార్చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com