Dawood Ibrahim : దావూద్ ఆచూకీ చెబితే 25 లక్షల రివార్డు.. ఎన్ఐఏ ప్రకటన..

Dawood Ibrahim : మోస్ట్ వాటెండ్ కిల్లర్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి ఇక కష్టకాలమేనా..!. దశాబ్దాలుగా భారత్కు చిక్కకుండా పాకిస్థాన్లో తలదాచుకుంటూ నేరసామ్రాజ్యాన్ని ఏలుతున్న దావూద్కు ఇక మూడిందా..! తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దావూద్ ఆచూకీ చెప్పిన వారికి NIA 25 లక్షల నజరానా ప్రకటించడం చూస్తుంటే...చీకటి సామ్రాజ్యాధినేతకు చెక్పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు దావూద్ కుడిభుజం, ప్రధాన అనుచరుడు చోటా షకీల్పై కూడ ఎన్ఐఏ నజరానా ప్రకటించింది...చోటా షకీల్ ఆచూకీ చెబితే 20 లక్షలు, అనీస్, చింకా, మెమన్ ఆచూకీ వెల్లడిస్తే 15 లక్షల రివార్డు ప్రకటించింది ఎన్ఐఏ. అటు1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడుగా దావూద్పై అభియోగాలున్నాయి.
ఇది ఇలాఉంటే దావూద్ ఇబ్రహీంకు చెందిన 'డీ' కంపెనీపై నజర్ పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ... ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న దావూద్ డీ కంపెనీ... ఆయుధాల స్మగ్లింగ్, నార్కోటెర్రరిజం, మనీలాండరింగ్తోపాటు నకిలీ కరెన్సీ, టెర్రరిస్ట్లకు నిధుల సాయం వంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతోందని NIA స్పష్టం చేసింది. అటు పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కర్ తోయిబా, జైషే మహ్మద్, ఆల్ఖైదా అంతర్జాతీయ టెర్రరిస్ట్ గ్రూప్లకు డీ కంపెనీ... కీలక సమాచారం అందిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు ఇదివరకే భావిస్తున్నాయి.
మరోవైపు ఐక్యరాజ్య సమితి దావూద్ను ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2018లో UNO విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, టెర్రరిస్టుల జాబితాలో దావూద్ పేరు కరాచీ అడ్రసుతో వెలుగులోకి వచ్చింది. దీంతో పాకిస్థాన్లో ఆశ్రయం పొందుతున్నట్లు ప్రపంచానికి అధికారికంగా నిర్ధరణ అయ్యింది. అటు దావూద్ తన అనుచరులైన అనీస్ ఇబ్రహీం, చోటా షకీల్, జావేద్ చింకా, టైగర్ మెమన్ సాయంతో.. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ నెట్వర్క్ను నడుపుతున్నాడని ఎన్ఐఏ పేర్కొన్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com