NIA COURT: పేలుళ్ల కుట్ర కేసులో తీవ్రవాదులకు పదేళ్ల జైలు

దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ (indian Mujahideen) తీవ్రవాదులకు ఢిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు(NIA court) పదేళ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు రెక్కీ నిర్వహించినట్లు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) వాదనలతో కోర్టు ఏకీభవించింది. పేలుళ్ల కోసం నిందితులు ఆయుధాలు, మందుగుండు పదార్థాలను సైతం సమకూర్చుకున్నారు. హైదరాబాద్కు ఒబేద్ రహమాన్, బీహార్కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్లను పేలుళ్ల కుట్ర కేసులో 2013 మార్చిలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరిని జులై 7వ తేదీన దోషులుగు నిర్ధారించిన NIA కోర్టు.. నేడు శిక్ష విధించింది. శిక్షతో పాటు డానిష్ అన్సారీకి రూ. 2,000, అఫ్తాబ్ ఆలమ్కు రూ. 10,000 జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి దేశంలో పలు పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్ల, 2013లో దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉందని ఛార్జ్షీట్లో పేర్కొంది. గతంలో వారణాసి, ముంబయి, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూర్ లో జరిగిన పేలుళ్లలోనూ నలుగురు నిందితుల పాత్ర ఉందని వెల్లడించింది.
ఈ కేసులలో మొత్తం 11మందిని నిందితులుగా చేర్చింది. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్ తో పాటు మరో నిందితుడు ఉన్నాడు. జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది.
నలుగురు దోషులపై దాఖలు చేసిన ఛార్జిషీట్లో NIA సంచలన విషయాలు పేర్కొంది. పాకిస్థాన్కు చెందిన కీలక నిందితులు రియాజ్ భత్కల్, భారత్కు చెందిన యాసిన్ భత్కల్లతో సహా ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులతో ఈ నలుగురు చాలా సన్నిహతంగా ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) వెల్లడించింది. వీరు దేశంలోని చాలా ప్రాంతాల్లో మరిన్ని పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టులో వాదించింది. వీరికి మరి కొందరు ఉగ్రవాదులతోనూ సంబంధాలు ఉన్నాయని వివరించింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరికొందరిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com