NIA: దేశంలో భారీ పేలుళ్ల కుట్ర భగ్నం

దేశంలో భారీ పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను NIA భగ్నం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ 8 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ఏజెంట్లను అరెస్టు చేసింది. వీరి వద్ద పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి సరకు, ఆయుధాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకుంది.
భారత్లో భారీ బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ NIA భగ్నం చేసింది. 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన NIA ...ఉగ్ర ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేసింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలకు సంబంధించిన ముడి సరకు, ఉగ్ర కుట్రకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది.
కర్ణాటకలోని బెంగళూరు, మహారాష్ట్రలోని పుణె, ముంబయి, ఝార్ఖండ్లోని జంషెడ్పుర్, బొకారో సహా దిల్లీలో NIA తనిఖీలు నిర్వహించింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీ పోలీసుల సహకారంతో NIA ఈ సోదాలు నిర్వహించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన 8 మంది ఏజెంట్లను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు వ్యూహరచన చేసి పేలుడు పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. మినాజ్ నేతృత్వంలో వీరంతా పని చేస్తున్నారు.
పేలుడు పదార్థాలకు ఉపయోగించే ముడి సరకులైన సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్పౌడర్, చక్కెర, ఇథనాల్, పదునైన ఆయుధాలను నిందితుల వద్ద నుంచి NIA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, నేరారోపణ పత్రాలు, స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు IEDల తయారీకి ఈ సామగ్రిని ఉగ్ర ముఠా సభ్యులు ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా వీరంతా ఉగ్ర సంస్థల నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఉగ్ర కార్యకలాపాల కోసం కళాశాల విద్యార్థులను నియమించుకోవడంపై వీరు దృష్టిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com