NIA : ఎన్ఐఏ సోదాలు.. పలువురు అరెస్ట్

NIA : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, హన్మకొండ, కృష్ణా జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అలాగే హన్మకొండలో చైతన్య మహిళా సంఘం కోకన్వీనర్ రాధ, సభ్యురాలు అనిత ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.
ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్న అనితకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత మూడ్రోజులుగా రెక్కీ నిర్వహించిన పోలీసులు.. వివరాలు గోప్యంగా ఉంచారు.
గత జూన్లో ఎన్ఐఏ అధికారులు.. తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్ జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. హైకోర్టు న్యాయవాది, చైతన్య మహిళా సంఘం సభ్యురాలు చుక్కా శిల్పతో పాటు దొంగిల దేవేంద్ర, దుబాసి స్వప్నలను అరెస్టు చేశారు. నర్సింగ్ విద్యార్థిని రాధను ప్రేరేపించి మావోయిస్టులోకి రిక్రూట్ చేయడంలో నిందితుల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
రాధను మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ తర్వాత గత మే 31న కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని ఎన్ఐఏ అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో ముగ్గురు చైతన్య మహిళా సంఘం సభ్యుల ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com