Nitin Gadkari: రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2వీ సాంకేతిక పరిజ్ఞానం

దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వాహనాల మధ్య కమ్యూనికేషన్ (V2V - వెహికల్ టు వెహికల్) టెక్నాలజీని తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీని ద్వారా వాహనాలు ఒకదానికొకటి వైర్లెస్గా సమాచారం పంపుకుంటూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తాయని ఆయన తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 43వ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
"ఈ టెక్నాలజీ కోసం టెలికాం శాఖ (DoT) సూత్రప్రాయంగా అంగీకరించి, ఉచితంగా స్పెక్ట్రమ్ కేటాయించనుంది" అని గడ్కరీ వెల్లడించారు. V2V కమ్యూనికేషన్ కోసం 5.875–5.905 GHz బ్యాండ్లో 30 MHz స్పెక్ట్రమ్ను కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా వాహనాల్లోని ఆన్-బోర్డ్ యూనిట్ (OBU) ద్వారా సమీపంలోని ఇతర వాహనాల వేగం, లొకేషన్, ఆకస్మిక బ్రేకింగ్ వంటి సమాచారం డ్రైవర్కు అందుతుంది. దీనివల్ల బ్లైండ్ స్పాట్స్లో ఉన్న వాహనాల గురించి కూడా ముందుగానే తెలుస్తుందని అధికారులు వివరించారు. ఈ పరికరం ఖరీదు సుమారు రూ. 5,000 నుంచి రూ. 7,000 వరకు ఉండొచ్చని అంచనా. ఈ ఏడాదిలోనే ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని రవాణా శాఖ కార్యదర్శి వి. ఉమాశంకర్ తెలిపారు.
ఇదే సమావేశంలో, స్లీపర్ బస్సుల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలపై నితిన్ గడ్కరీ తీవ్రంగా స్పందించారు. "గత కొన్ని నెలల్లో జరిగిన ఆరు బస్సు అగ్నిప్రమాదాల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సుల నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదని, వివిధ స్థాయిల్లో అవినీతి జరుగుతోందని మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాను" అని గడ్కరీ అన్నారు. ఇకపై స్లీపర్ కోచ్ బస్సులను ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థలు మాత్రమే తయారు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ లైటింగ్, ఎగ్జిట్స్ వంటి భద్రతా ఫీచర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
దేశంలో ఏటా సుమారు 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, వీరిలో 66 శాతం మంది 18-34 ఏళ్లలోపు వారేనని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం మోటారు వాహన చట్టానికి 61 సవరణలు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో పాటు, రోడ్డు ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల వరకు ఏడు రోజుల పాటు ఉచితంగా క్యాష్లెస్ చికిత్స అందించే పథకాన్ని కూడా దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

