Nitish Kumar : 8వ సారి బిహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్..
Nitish Kumar : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జనతాదళ్ నేత నీతీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్లతో జట్టుకట్టారు. ఈ మహాకూటమి సారథిగా ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ ఫాగు చౌహన్.. నితీష్ చేత ప్రమాణం చేయించారు. బిహార్ సీఎంగా నితీష్ 8వసారి బాధ్యతలు చేపట్టారు. ఇక ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో అయిదేళ్లుగా పెనవేసుకున్న బంధాన్ని తెంచుకున్న నితీశ్.. రాజీనామా చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే మళ్లీ సీఎం పీఠమెక్కారు. ఆర్జేడీ, కాంగ్రెస్ సహా 7 పార్టీలతో జట్టుకట్టి మరోసారి అధికారంలోకి వచ్చారు.
నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడుసార్లు బిహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల పాటే సీఎంగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017, 2020లో సీఎంగా బాధ్యతలు నిర్వహించి బిహార్లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ పోటీ చేయడంలేదు. ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన సీఎంగా సేవలందిస్తూ వస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com