నీట్ కామన్ కౌన్సెలింగ్..కన్ఫ్యూజన్

మెడికల్ కాలేజ్లలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఫలితాలు విడుదలైయ్యాయి. అయితే కౌన్సెలింగ్ విషయంలో సెంట్రల్ వర్సెస్ స్టేట్స్ గా మారుతుంది. మరీ ముఖ్యంగా కేంద్రం తీరును బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.మొదట్లో ఇంజనీరింగ్తోపాటు మెడికల్ కాలేజ్ ల్లో ప్రవేశాలకు ఎంసెట్ ఉండేది. అయితే నీట్ వచ్చాక మెడికల్ కాలేజ్లకు కేంద్రం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్ మాత్రంకు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఎంసెట్ నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న నేషనల్ మెడికల్ కౌన్సిల్ సూచనలతో నీట్కు కామన్ కౌన్సెలింగ్ను తెరపైకి తెచ్చింది. గెజిట్ విడుదల చేసింది. గైడ్లైన్స్ విడుదలకు రెడీ అవుతోంది.కౌన్సెలింగ్ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి సమాచారం లేకపోవడంతోనీట్ ఫలితాల్లో అర్హత సాధించిన వారికి ఎవరు కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్న అంశంపై కన్ఫ్యూజన్ నెలకొంది.
మరోవైపు నీట్ ర్యాంకుల ఆధారంగా మెడికల్ కాలేజ్లల్లో సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య విశ్వవిద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాయి.తెలంగాణలో కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం, ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలు కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడుతున్నాయి. అయితే కేంద్రం ఆల్-ఇండియా కోటా కింద 15 శాతం సీట్లను ప్రత్యేక కౌన్సెలింగ్తో భర్తీ చేస్తుంది. మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్రాలు భర్తీ చేస్తాయి. అయితే కొన్ని ప్రైవేటు కాలేజీల అక్రమాలను అడ్డుకునేందుకు దేశమంతా ఒకే కౌన్సెలింగ్ను నిర్వహిస్తామని కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ చెబుతుంది.
అయితే కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ, తమిళనాడు సహా పలు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం నిర్ణయం రాష్ట్రాల హక్కులను హరించడమేనని తమిళనాడు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై కేంద్రం స్పందిస్తూ కామన్ కౌన్సెలింగ్ నుంచి తమిళనాడును మినహాయించనున్నట్లు తెలిపింది. దీన్ని ఇతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ తమకూ అలాంటి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ సారి కామన్ కౌన్సెలింగ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక కేంద్రం దేశమంతా ఒకే తరహా కౌన్సెలింగ్ చేపడితే రాష్ట్రాల స్థాయిలో రిజర్వేషన్లపై ఆ ప్రభావం పడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.వివిధ రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్న రిజర్వేషన్లతో కేంద్రం కౌన్సెలింగ్ నిర్వహించడం అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను కేంద్రం గత ఏడాది ఎత్తేసింది. తెలంగాణలో వారికి 4 శాతం రిజర్వేషన్ కొనసాగుతోంది. కేంద్రం కౌన్సెలింగ్ నిర్వహిస్తే తెలంగాణలోని ముస్లిం రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకోకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ ఉండగా తెలంగాణ, ఏపీల్లో వీరు ఓసీ కేటగిరీకి వస్తారు. ఇలాంటి వ్యత్యాసాలున్నప్పుడు కామన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైద్య విశ్వావిద్యాలయాల అధికారులు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, రిజర్వేషన్ల అంశంపై ఉన్న అనుమానాలు నివృత్తి కావాల్సి ఉందని పేర్కొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com